Pages

Showing posts with label ISRO. Show all posts
Showing posts with label ISRO. Show all posts

PSLV Again Success - పీఎస్‌ఎల్వీ మళ్లీ సక్సెస్

పీఎస్‌ఎల్వీ మళ్లీ సక్సెస్..

* శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్వీ- సీ 23 ప్రయోగం
* 5 విదేశీ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశం
* ప్రత్యక్షంగా తిలకించిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు

శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరోమారు విజయబావుటా ఎగురవేసింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి తన పీఎస్‌ఎల్‌వీ సీ23 ద్వారా సోమవారం ఉదయం విజయవంతంగా ఒకేసారి గగనతలంలోకి పంపించింది. ఐదు ఉపగ్రహాలనూ భూమికి 659 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రనస్ ఆర్బిట్)ల్లోకి ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు కౌంట్‌డౌన్ ముగియగానే.. మొదటి వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రధాని, గవర్నర్, సీఎంలు ఆసక్తిగా తిలకిస్తుండగా.. శాస్త్రవేత్తలు ఉద్విగ్నంగా పరిశీలిస్తుండగా.. షార్‌లోని వివిధ భవనాలపై స్థానికులు ఆకాశంకేసి చూస్తుండగా.. పీఎస్‌ఎల్‌వీ దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది.

44.5 మీటర్ల పొడవైన రాకెట్ ప్రయాణమంతా నిర్దేశిత మార్గంలోనే కొనసాగింది. రాకెట్‌లోని నాలుగు దశలు అద్భుతంగా పనిచేశాయి. మొదటి దశ ప్రయోగాన్ని 138 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 110.5 సెకన్లకు 52.7 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. రెండో దశ 42 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 261.1 సెకన్లకు 218.7 కిలోమీటర్లు ఎత్తులో పూర్తయింది. మూడో దశను 7.6 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 526.3 సెకన్లలో 536.8 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. నాలుగోదశ 2.5 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 1,033 సెకన్లలో 659.1 కిలోమీటర్ల ఎత్తులో దిగ్విజయంగా పూర్తయింది.

అనంతరం 1,070.1 సెకన్లకు 659.8 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో స్పాట్-07 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. 1,110 సెకన్లకు 660.6 కిలోమీటర్ల ఎత్తులో జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను, 1,141.4 సెకన్లకు 661.2 కిలోమీటర్ల ఎత్తులో కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్ 7.1ని, 1,171.4 సెకన్లకు 661.8 కిలోమీటర్ల ఎత్తులో ఎన్‌ఎల్‌ఎస్ 7.2ని, 1,195.1 సెకన్లకు 662.3 కిలోమీటర్ల ఎత్తులో సింగపూర్‌కు చెందిన వెలాక్సీ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల వదనాల్లో విజయగర్వంతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది. ప్రధాని సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. కక్ష్యలో చేరిన ఉపగ్రహాలు సక్రమంగానే ఉన్నట్లు మారిషస్ నుంచి సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో ప్రకటించింది.

పీఎస్‌ఎల్‌వీ 27 ప్రయోగాలు.. 38 విదేశీ ఉపగ్రహాలు...
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 27వ ప్రయోగం. ఇస్రో వాణిజ్యపరంగా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 అతి ఎక్కువ బరువైనది కావడం విశేషం. దీని బరువు 714 కిలోలు. భూమిపై 60 - 60 కిలోమీటర్ల వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీనిప్రత్యేకత. సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించే జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి చేర్చింది. ఈ ఐదు ఉపగ్రహాలతో పాటు రాకెట్ గమనం, ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టే తీరును పరిశీలించేందుకు ఇస్రో రూపొందించిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్) పేలోడ్‌ను కూడా ఇందులో ప్రయోగించారు.

ఇది ఉపగ్రహం కానప్పటికి రాకెట్ గమనాన్ని పరిశీలించిన తర్వాత కక్ష్యలో వదిలిపెడతారు. కానీ ఎలాంటి సేవలు అందించదు. పూర్తి వాణిజ్యపరమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సుమారు 55 రోజుల పాటు శ్రమించారు. తాజా ప్రయోగ విజయంతో.. ఇప్పటివరకూ 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను రోదసిలోకి పంపి వాణిజ్యపరంగా తిరుగులేని ఉపగ్రహ వాహకనౌకగా పీఎస్‌ఎల్‌వీ పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశీయంగా 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది.

శాస్త్రవేత్తలందరికీ రాష్ర్తపతి, మోడీ అభినందనలు...
పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని మోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్,  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ తదితరులు మిషన్ కంట్రోల్ రూం నుంచి వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్త బి.ఎన్.సురేష్ ప్రయోగానికి సంబంధించిన విశేషాలను వివరించారు. ప్రయోగం ప్రతి దశ విజయవంతంగా సాగడంతో అతిథులతో పాటు శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి శాస్త్రవేత్తను ప్రధాని మోడీ అభినందించారు.  పీఎస్‌ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-23 ప్రయోగం విజయవంతం పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఓ ప్రకటనలో హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

స్పాట్ -7
ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లోకెల్లా అతి ఎక్కువ బరువైనది(714 కిలోలు). భూమిపై 60 - 60 కి.మీ. వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీని ప్రత్యేకత. 659.8 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఏఐశాట్
సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను ప్రయోగించారు. బరువు 15 కిలోలు. 660.6 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టారు.

ఎన్‌ఎల్‌ఎస్ 7.1
కెనడాకు చెందినఎన్‌ఎస్‌ఎల్-7.1, ఎన్‌ఎస్‌ఎల్-7.2 ఉపగ్రహాలను రెండూ ఒకే రకమైన కచ్చి తత్వంతో, ఒకే రకమైన వేగంతో, ఒకే దిశలో ప్రయాణించేలా రూపొందించారు.

ఎన్‌ఎల్‌ఎస్ 7.2
30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1ను 661.2 కి.మీ. ఎత్తులోను, ఎన్‌ఎల్‌ఎస్ 7.2ని 661.8 కి.మీ. ఎత్తులోను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

వెలాక్సీ
సింగపూర్‌కు చెందిన ఈ ఉపగ్రహాన్ని తమ దేశీయ ఇమేజ్ సెన్సర్ల టెక్నాలజీని ప్రదర్శించేందుకు ప్రయోగించారు. 662.3 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

Indian Space Victories - భారతదేశ అంతరిక్ష విజయాలు

Indian Space Victories - భారతదేశ అంతరిక్ష విజయాలు...

ప్రతి పోటీ పరీక్షలోనూ జనరల్ అవేర్‌నెస్‌లో కీలకమైన విభాగం శాస్త్ర, సాంకేతిక అంశాలు (సైన్స్ అండ్ టెక్నాలజీ). ఈ విభాగంలో ముఖ్యంగా మనదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాలు, ఏ సంవత్సరంలో, ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆ ఉపగ్రహాల వల్ల ఉపయోగాలు వంటి అంశాలను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాల వివరాలు..

ముందుగా ప్రపంచ అంతరిక్ష రంగాన్ని పరిశీలిస్తే.. అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను 1957లో అప్పటి సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్) ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్-2ను, అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. 1958లో అమెరికా తన తొలి ఉపగ్రహం ఎక్స్‌ప్లోరర్-1ను ప్రయోగించింది.
 రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ 1961, ఏప్రిల్ 12న వొస్తోక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించాడు. మే,  1961లో అలెన్ షెపర్‌‌డకు మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా గుర్తింపు దక్కింది. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ రష్యాకు చెందిన వాలెంతినా తెరిష్కోవా. ఆమె 1963, జూన్ 16న అంతరిక్షంలోకి ప్రవేశించింది. రష్యాకు చెందిన అలెక్సీ లెనోవ్ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు. ఆయన 1965, మార్చి18న ఈ ఘనత సాధించాడు. 1969, జూలై 20న అమెరికాకు చెందిన నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్ చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనతోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు.
1984లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నవంబర్, 1997లో కొలంబియా నౌకలో ప్రయాణించిన కల్పనా చావ్లా మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు. ఆమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా నౌక కూలిపోవడంతో మరణించారు. భారతీయ అమెరికన్ మహిళ సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు నడిచిన (స్పేస్‌వాక్) మహిళ కూడా ఈమే. సునీత 50 గంటల 40 నిమిషాలపాటు అంతరిక్షంలో నడవటంతోపాటు మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసింది.

 ఇస్రో:
 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్‌‌చ ఆర్గనైజేషన్-ఇస్రో)ను 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో భారత ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం నియంత్రణలో పనిచేస్తోంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె.రాధాకృష్ణన్. అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటైన ఇస్రో 1975, ఏప్రిల్ 19న భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది.
 భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఆయన ఇస్రో మొదటి చైర్మన్. ఇప్పటివరకు ఏడుగురు ఇస్రో చైర్మన్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. వారు.. విక్రమ్ సారాభాయ్, ఎం.జి.కె.మీనన్, సతీశ్ ధావన్, యు.ఆర్.రావు, కె.కస్తూరిరంగన్, జి.మాధవన్ నాయర్, కె.రాధాకృష్ణన్. వీరిలో సతీశ్ ధావన్ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1972 నుంచి 1984 వరకు 12 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు.

 భారత అంతరిక్ష రంగంలో మైలురాళ్లు

 1962 - భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు.
 1965 - తుంబాలో స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు.
 1969 - ఆగస్ట్ 15న ఇస్రో ఏర్పాటైంది. అప్పుడు అణుశక్తి విభాగం కింద ఉండేది.
 1971 - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ కేంద్రం ఏర్పాటైంది.
 1972 - డిపార్‌‌టమెంట్ ఆఫ్ స్పేస్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను అంతరిక్ష విభాగం కిందకు తీసుకువచ్చారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
 1975 - భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19న రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు.
 1979 - భాస్కర -1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 1980 - శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 1981 - జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. అఞఞ్ఛ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పెరిమెంట్.
 1981 - భాస్కర -2 ప్రయోగం.
 1982 - అమెరికా రాకెట్ ద్వారా ఇన్‌శాట్-1ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం.
 1983 - ఇన్‌శాట్ -1 బీ ప్రయోగం.
 1984 - రష్యా రాకెట్ సోయూజ్ టీ-11లో రాకేష్‌శర్మ అంతరిక్షయానం.
 1987 - విఫలమైన మొదటి ఎస్‌ఎల్‌వీ ప్రయోగం (ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్).
 1988 - రష్యా రాకెట్ ద్వారా తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్‌ఎస్-1ఏ ప్రయోగం.
 1991 - ఐఆర్‌ఎస్-1బీ ప్రయోగం.
 1992 - ఇన్‌శాట్ -2ఏ ప్రయోగం.
 1993 - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది.
 1994 - పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 1995 - ఇన్‌శాట్ -2సీ, ఐఆర్‌ఎస్-1సీ ప్రయోగం.
 1996 - పీఎస్‌ఎల్‌వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్‌ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.
 1997 - ఐఆర్‌ఎస్-1డీ ప్రయోగం.
 1999 - ఓషన్ శాట్‌తోపాటు విదేశీ శాటిలైట్లను కూడా తొలిసారి ప్రయోగించారు. కొరియా, జర్మనీలకు చెందిన శాటిలైట్లను ప్రయోగించారు.
 2000 - ఇన్‌శాట్-3బీ ప్రయోగం.
 2001- జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జిఎస్‌ఎల్‌వీ) రాకెట్ ద్వారా జీశాట్-1 శాటిలైట్‌ను ప్రయోగించారు.
 2002 - వాతావరణ ఉపగ్రహం కల్పన-1ను ప్రయోగించారు. దీని మొదటి పేరు మెట్‌శాట్-1.
 2003 - జీశాట్-2ను, రిసోర్‌‌సశాట్-1ను ప్రయోగించారు.
 2004 - విద్యాసేవలకై ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 2005 - మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ6 ద్వారా ప్రయోగించారు.
 2005 - ఇన్‌శాట్-4ఏ ప్రయోగం.
 2007 - కార్టోశాట్-2, ఇన్‌శాట్-4సీఆర్‌ను ప్రయోగించారు.
 2008 - పీఎస్‌ఎల్‌వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి.
 2008 - పీఎస్‌ఎల్‌వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు.
 2009 - పీఎస్‌ఎల్‌వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు.
 2010-పీఎస్‌ఎల్‌వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.
 2011-పీఎస్‌ఎల్‌వీ-సీ16 ద్వారా రిసోర్‌‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్స్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు.
 2012-ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్‌ఎల్‌వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం.
 2013-పీఎస్‌ఎల్‌వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. అవి.. ఆస్ట్రియాకు చెందిన యూనిబ్రైట్, బ్రైట్; డెన్మార్‌‌కకు చెందిన అవ్‌శాట్-3, యూకేకు చెందిన స్ట్రాండ్, కెనడాకు చెందిన నియోశాట్, సాఫైర్.
 2013-పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఈ ఏడాది జూలై1న ప్రయోగించారు.
 2013-ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి ఈ ఏడాది జూలై 26న భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీని విజయవంతంగా ప్రయోగించారు.
 2013 - ఈ ఏడాది నవంబర్‌లో మార్‌‌స ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
 చంద్రయాన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబర్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఇది 312 రోజులు పనిచేసి 2009, ఆగస్టు 29న ఆగిపోయింది. చంద్రయాన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. త్వరలో చంద్రయాన్-2ను కూడా ప్రయోగిస్తారు.

 పరిశోధనా సంస్థలు - వాటి విధులు
 1.ఇస్రో - బెంగళూరు
 2.ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ - అహ్మదాబాద్: ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం.
 3.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం.
 4.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం.
 5.తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్‌లను ప్రయోగించే ప్రదేశం.
 6.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు.
 7.మాస్టర్ కంట్రోల్ కేంద్రం - భోపాల్ (మధ్యప్రదేశ్), హసన్ (కర్ణాటక).
 8.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ - తిరువనంతపురం: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కోర్సులను నిర్వహిస్తోంది.
 9.ఆంట్రిక్స్ కార్పొరేషన్-బెంగళూరు: ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానం, సేవలను మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేశారు.
 ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
 1.ఏ సంవత్సరంలో ఇండియా తన మొదటి
 ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది?
 2.కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం?
 3.మానవ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిన మొదటి దేశం?
 4.విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉన్న రాష్ర్టం?
 5.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
 6.చంద్రుడిపై మానవుడు ఎప్పుడు కాలుమోపాడు?
 7.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఏ రాష్ర్టంలో ఉంది?
 8.ఇస్రో ప్రస్తుత చైర్మన్?

 సమాధానాలు:
 1. 1975; 2. యూఎస్‌ఎస్‌ఆర్; 3. యూఎస్‌ఏ; 4. కేరళ; 5. శ్రీహరికోట; 6. 1969; 7. కేరళ; 8. కె.రాధాకృష్ణన్
 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.