mAtru garbhAsanam - మాతృగర్భాసనం
ఈ ఆసనం వేసినప్పుడు దేహం తల్లిగర్భంలోని పిండం ఆకృతిలో కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మాతృగర్భాసనం అంటారు.పద్మాసన స్థితిలో కూర్చుని, రెండు అరచేతులు మోకాళ్లమీద ఉంచాలి. ఈ స్థితిలో వెన్నెముకను నిటారుగా ఉండాలి.
ఇప్పుడు రెండు చేతులను రెండు కాళ్ల మధ్యకు చొప్పించి (ఫొటోలో కనిపిస్తున్నట్లు) అరచేతులను నేలకు ఆనించాలి.
ఇప్పుడు రెండు చేతులను ఒకదాని తర్వాత మరొకటి వంచుతూ అరచేతులను చెంపలకు ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలన్న విషయాన్ని మరచిపోకూడదు. దృష్టి నేరుగా ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు పైకి లేచి ఉంటాయి. శరీరం బరువు పిరుదుల మీద పడుతుంది. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి.
ఇలా మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.
ఉపయోగాలు
నరాల బలహీనత తగ్గుతుంది.
ఆందోళన, ఆవేశం, కోపం తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఏకాగ్రత పెరుగుతుంది.
పొట్ట తగ్గుతుంది. మోకాళ్లు, చేతులు శక్తిమంతం అవుతాయి.
పిరుదులలో చేరిన కొవ్వు కరుగుతుంది. రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.
జాగ్రత్తలు
అధికబరువు ఉన్న వాళ్లు, తొడలలో కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లు, భుజాల
సమస్యలతో బాధపడుతున్నవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
No comments:
Post a Comment